Archives

సాధువు – ఆవు.

విలువ : శాంతి
ఉప విలువ : పట్టుదల ,సహనం

ఒకప్పుడు స్వామి నారాయణ అనబడే గొప్ప సాధువు ఉండేవాడు. అయన ఉత్తరప్రదేశ్కి చెందిన వాడు. అయినప్పటికీ గుజరాత్లో ఆయన అనుచరులు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఒకరోజున ఆయన,  కొంతమంది గ్రామస్తులు ఒక ఆవుతో అవస్థ పడుతుండటం గమనించాడు . ఎందుకంటే  పాలు పిండటానికి ఎవరు వెళ్ళినా ఆ ఆవు వాళ్ళని తన్నేస్తున్నది . అందువల్ల వాళ్ళు ఆ ఆవు దగ్గర పాలు పిండలేకపోతున్నారు. ఆవు , దగ్గరకే అసలు వెళ్ళలేకపోతున్నారు . ఎవరైనా దగ్గరకు వస్తున్నారు  అనగానే అది కాలితో తన్నేస్తున్నది . స్వామి నారాయణ కేవలం సాధువు మాత్రమే కాదు గొప్ప సాధకుడు కూడా .ఆ గ్రామస్థులతో  ఆయన “నేను ఎదో ఒక ఉపాయముతో ఈ  తన్నటాన్ని ఆపుతాను”  అని చెప్పారు.

ఒక పొడవాటి కర్ర పట్టుకుని ఆ ఆవుకి కొంచం దూరంగా కూర్చుని ఆ కర్రతో ఆవు కాలిని కొద్దిగా తాకాడు . అప్పుడు ఆవు కాలితో వెంటనే తన్నింది . కొద్ది క్షణాల తరువాత మళ్ళీ ఆవుని కర్రతో తాకాడు . అది మళ్ళీ తన్నింది. ఉదయం నుంచి సాయంకాలం దాక భోజనం కూడా చేయకుండా స్వామి నారాయణ అదే పనిగా కర్రతో ఆవు కాలిని తాకటం ,అది కాలితో తన్నటం జరిగింది. ఈ విధంగా 12 గంటలపాటు అయన చేస్తున్న ప్రయత్నం చూసి ఆ గ్రామస్తులు ఆశ్చర్య పడ్డారు. ఈ కార్యక్రమం అలా సాగుతూనే ఉంది . ఆ విధంగా ఆవు కాలితో ఎంత సేపు తన్నగలదు ? అది కూడా ప్రాణం ఉన్న జీవే కదా ! దానికి కూడా విసుగు ,అలసట వచ్చి తన్నటం ఆపేసింది . అప్పుడు గ్రామస్తులను వెళ్ళి ఆ ఆవు దగ్గర పాలు పితకమని ఆయన చెప్పారు . ఆ తరువాత ఆవు తన్నలేదు ,వాళ్ళు పాలు చక్కగా పిండుకున్నారు.

మనసు కూడా ఇలాగే ఏదో విధంగా అల్లకల్లోలంగా ఉంటుంది . స్వామి, ఆవును ఏ విధంగా లోబరుచుకోగలిగారో అదే విధంగా మనసును కూడా లొంగదీసుకోవాలి. మనం చెప్పినది ఏది మనసు అంగీకరించదు . మనం చెప్పినదానికి పూర్తిగా వ్యతిరేకంగా దానికి నచ్చిన రీతిలో అది సమాధానం ఇస్తూ ఉంటుంది. “ఇది చెయ్యి అని మనం చెపితే చెయ్యను ,అది కాకుండా వేరే ఇంకేదో చేస్తాను అంటుంది మనసు. 

నీతి : మనసు ,ఇంద్రియములు ,కోరికలను నిగ్రహించటం అంత సులభమైన విషయం కాదు . నిరంతర సాధనతో మనసును మచ్చిక చేసుకోగలగాలి .

https://saibalsanskaar.wordpress.com/2017/02/15/the-saint-and-the-cow/

మంచి పనులు చేసి ,మంచి ఫలములు అనుభవించండి !

విలువ : శాంతి

ఉపవిలువ : సహనము ,ఓర్పు

              కోతుల గుంపు ఒకటి మామిడి మొక్కలను ఒక తోటలో నాటాయి . చిన్న మామిడి మొలకలను నెలలో పాతి ఆ కోతులు కొన్ని  రోజులపాటు నీళ్ళు  పోశాయి . మరి కొద్ది  రోజులు కాగానే వేళ్ళు భూమి లోపల ఎంత లోతుగా పాకుతున్నాయో  చూద్దామని ఆ మొక్కలన్నిటినీ పీకేశాయి. మొక్కలు తొందరగా పెరిగి పండ్లు రావాలని అనుకున్నాయే కానీ అవిపెరగటానికి ,చెట్లగా ఎదిగి కాయలు కోసి అవి పండటానికి ఎంత సమయం పడుతుందో వాటికి  తెలియదు! 

            ఆ కోతులు  తాము చేసిన పనికి సత్వర ఫలితం రావాలని కోరుకున్నాయి. తాము కోరుకున్న పండ్లు వాటికి  లభించాలంటే ఎంత కష్ట పడాలి ,ఎంత ఓర్పు ఉండాలి , ఎంత పట్టుదల ఉండాలి అన్న  విషయాలను అవి గుర్తించలేకపోయాయి . 

నీతి : 

             ఏదైనా  అభివృద్ధి చెంది పరిణితి చెందాలంటే సరైన సమయం రావాలి.ఫలితం కోసం  ఆత్రుత చెందకుండా ఓర్పుతో , పట్టుదలతో పని చెయ్యాలి  . పూర్తి నిబద్ధతతో ,శ్రద్ధతో కర్తవ్యమును నిర్వహించటమే మనం చేయవలసింది . సరైన సమయంలో చేసిన పనికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. సహనం ,పట్టుదలతో చాలా కాలం శ్రమిస్తే కానీ విజయం లభించదు. కాబట్టి మనమందరం కూడా మన కర్తవ్యమును సక్రమంగా నిర్వహించినట్లయితే మనకి తగిన ఫలమునకు లభిస్తుంది . సాగు శ్రద్దగా చెయ్యండి . చక్కని ఫలన్ని  పొందండి . 

తృప్తి

విలువ — శాంతము
అంతర్గత విలువ — సంతోషము

ఇది ఒక రాజుగారి కథ !
భోగ – భాగ్యములు అనుభవిస్తున్న రాజుగారికి, మనస్సు ఆనందంగా, శాంతంగా ఉండేది కాదు. దీనికి కారణం తెలిసేది కాదు రాజుగారికి.
ఒక రోజు రాజుగారికి, ఒక పనివాడు, సంతోషంగా, ఉల్లాసంగా, పాటలు పాడుకుంటూ కనిపించాడు . “ఈ రాజ్యానికి రాజునైన నాకు లేని నిమ్మది, శాంతి, ఈ పనివాడికి ఎలా కలుగుతోంది’ అని అనుకున్నారు రాజుగారు.

‘నీ సంతోషానికి కారణం ఏమిటి ?”, అని ఆ పనివాడిని ,రాజుగారు అడిగారు
దానికి పనివాడు ‘అయ్యా ! నాకు, నా కుటుంబానికి కావలిసినది-ఉండడానికి చోటు, కడుపు నిండా తినడానికి భోజనము , ఈ రెండూ ఉన్నందువల్ల ,మేము సంతోషంగా జీవించగలుగుతున్నాము”,అని సమాధానం చెప్పాడు.

రాజుగారు జరిగింది తన మంత్రికి చెప్పారు. పనివాడి కథ విన్న తరువాత, మంత్రి “మహారాజా, పనివాడు మన ‘99వ క్లబ్బులో(సంఘము)’ , లేడు కదా, అందుకనే సంతోషంగా ఉన్నాడు ‘ అని అన్నారు.

‘99వ క్లబ్బు’ అంటే ఏమిటి అని ఎంతో ఉత్సుకతతో అడిగారు రాజుగారు.
“ఇది తెలియాలి అంటే, 99 బంగారు నాణాలున్న సంచీని పనివాడి ఇంటి ముందర ఉంచండి” తరువాత మీకే అర్ధమవుతుంది అన్నారు మంత్రి.

మరునాడు ఇంటి ముందర , బంగారు నాణాలు ఉన్న సంచి చూసి, సంతోష పడిన ఆ పనివాడు, నాణములను ఎన్నో మార్లు లెక్క పెట్టి, ఇందులో 99 ఉన్నాయి, ఎలాగైనా సరే కష్ట పడి, వీటిని 100 చెయ్యాలి “ అని అనుకున్నాడు.

ఆ రోజు నుంచి పనివాడిలో ఎంతో మార్పు కనిపించింది. సంతోషంగా ఉండడం, ఉల్లాసంగా పాటలుపాడుకోవటం పూర్తిగా మర్చిపోయాడు. ఎంతసేపటికీ ఒకటే ఆలోచన!
99బంగారు నాణాలని, ఎలా 100బంగారు నాణాలు చెయ్యాలి? అని ఆలోచిస్తూ ,అతనికి సహాయపడటంలేదని కుటుంబ సభ్యుల మీద చాలా చికాకు పడే వాడు.

ఇదంతా గమనిస్తున్న రాజుగారు, ఎంతో ఆశ్చర్య పోయారు.
అప్పుడు మంత్రి రాజుగారితో ,”మహారాజా! పనివాడు 99వ క్లబ్బు మాయలో మునిగిపోయాడు “,చూశారా అని అన్నారు.

99 ఉన్నాయి అని తృప్తి లేకుండా, 100కి ఇంకా ఒక్కటి తక్కువ ఉంది అని అసంతృప్తి పడే వారినే ‘99 క్లబ్బు లేదా సంఘము అంటారు” . వీళ్ళు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని ఆ ఒక్క విషయం లేదా వస్తువు కోసం పాకులాడుతూ ఉంటారు.

నీతి

మనకి ఉన్న దాంతో ఏంటో తృప్తిగా జీవించవచ్చు. కానీ ఉన్న దానికంటే కొంచం ఎక్కువ దొరికినప్పుడల్లా ఇంకా ఇంకా కావాలి అని ఆరాట పడుతూ ఉంటాము.

భగవంతుడు మనకి చక్కటి అనుభవం, పదవి లేదా హోదాని అనుగ్రహించినప్పుడు , దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించకుండా,సంతోష పడకుండా, ఇంకా ఎక్కువ కావాలి అని, అతి ఆశతో నిద్రాహారాలు కూడా లెక్క చేయకుండా జీవిస్తున్నాము.
దురాశ పతనానికి హేతువు !

https://saibalsanskaar.wordpress.com/2016/04/02/contentment-the-99-club/

మనమందరం సంతోషంగా ఉందాము!!!

విలువ : శాంతి
పవిలువ : నిర్లిప్తత .

అనగనగా రాజభవముకు కొంత దూరంలో ఒక బిచ్చగాడు నివసించేవాడు . అతడు ఒక రోజు ఆ భవనపు గోడపై ఒక నోటీసు బోర్డును చూశాడు.అందులో ,”రాజుగారు ఒక విందును ఇవ్వబోతున్నారు, ఆ విందుకు రాజు వేషధారణలో వచ్చేవారందరు ఆహ్వానితులే.”,అని ఉంది. ఆ ప్రకటన చదివిన బిచ్చగాడికి ఒక వింత కోరిక కలిగింది. తాను ఆ విందుకు వెళ్లి ఆ భోగాలన్నీ చూడాలనుకున్నాడు. కానీ రాజు ధరించే దుస్తులు తనవద్ద లేవు. వెంటనే అతను ఒక ఆలోచన చేశాడు. తన దుస్తులు చిరిగిపోయాయి. విందులో పాల్గొనాలి అంటేరాజరికపు దుస్తులు కావాలి అందుకని రాజు కాపలా దారు వద్దకు వెళ్ళి తనను రాజుగారి వద్దకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని కోరాడు.
కాపలాదారు లోనికి వెళ్ళి రాజుగారు కొలువులో ఉండటం చూసి,ఆయన ప్రజల కష్టమములను,సమస్యలను వింటున్న సందర్భం చూసి ,ఈ బిచ్చగాడిని లోనికి పోవుటకు అనుమతి ఇచ్చాడు. బిచ్చగాడు రాజసభలోనికి వెళ్ళి రాజు ముందర చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు బిచ్చగాడిని, “నీకు ఏమి కావాలి?”, అని అడిగాడు . బిచ్చగాడు, “రాజా! మీరూ ఇవ్వబోతున్న విందుకు, నాకు రావాలని ఉంది . దయచేసి మీ పాత దుస్తులు నాకు ఇప్పిస్తారా”? అని కోరాడు. రాజుగారు తన దుస్తులను అతనికి ఇప్పించారు . బిచ్చగాడు ఆ దుస్తులు తన సైజుకే ఉన్నాయని చాలా సంతోషించాడు. రాజుగారన్నారు ,ఆ బీదవానితో ,”ఈ దుస్తులు ఎప్పటికీ ఇలానే కొత్తవిగా ,శుభ్రంగా తాజాగా ఉంటాయి. వీటిని ఉతకవలసిన పని లేదు. ఎన్నాళ్లు వాడినా చినిగిపోవు”, అని చెప్పారు. ఈ దుస్తులను ధరించి ఆతను విందుకు రావచ్చు అని కూడా చెప్పాడు. ఇది విన్న బిచ్చగాడి ఆనందానికి అంతు లేదు. అతని కళ్ళవెంట నీరు కారింది. వంగి నమస్కారములు చేసి ధన్యవాదములు చెప్పాడు. కానీ, అతనికి రాజు గారి మాటపై నమ్మకము లేదు! ఒకవేళ రాజుగారు ప్రసాదించిన బట్టలు చినిగి పొతే తన పాత బట్టల అవసరం ఉంటుంది ,అని తన పాత బట్టల మూట ఒకటి తయారు చేసికున్నాడు.
అతనికి ఉండటానికి ఒక చోటు అంటూ లేదు. అందువల్ల ఆ మూట చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. తాను వేసుకున్న రాజుగారి బట్టలు చక్కగా మురికి పట్టకుండా శుభ్రంగా ఉండేవి. అయినా తన పాత బట్టలు మూట వదిలేవాడు కాదు. అదే మూట ప్రక్కన పెట్టుకుని రాజు గారిచ్చిన విందుకు వెళ్ళాడు. కానీ లోపల బాధ పడుతూనే ఉన్నాడు. రాజ భవనం లో భోం చేస్తున్నందుకు ఆనందించ లేక పోయాడు. ఎందుకంటే తన పాత బట్టల మూటను ఎవరన్నా కాజేస్తారేమో అని భయము వల్ల. రాజుగారు చెప్పినట్లు రాజు దుస్తులు ఎప్పుడు కొత్తవిగానే ఉన్నాయి. కానీ ఆ బీదవాడు తన పాత బట్టలపై మమకారం వదులుకోలేక ఆ మూటను పట్టుకునే, తిరుగుతుండేవాడు.ఆ బట్టల అవసరం ఏమాత్రం లేకపోయినా సరే. వాటిమీద ప్రేమ వల్ల , ఆ మూట తనతో పాటు ఉండాల్సిందే. అందరు అతనిని “పాతగుడ్డల మనిషి”అంటుండేవారు.
కొన్నాళ్లకు బిచ్చగాడు మంచం పట్టాడు. కానీ పాత గుడ్డల మూట తన దిండు ప్రక్కనే పెట్టుకున్నాడు. రాజు గారు ఒకసారి ఈ బిచ్చగాడి గురించి తెలిసి అతనిని పలకరించటానికి వచ్చాడు. రాజుగారు ఆ బిచ్చగాడిని చూసి చాలా జాలిపడ్డాడు . ఎందుకంటే మూట అవసరం లేక పోయినా ,ఎక్కడ ఎవరన్నా ఆ మూట తీసి కెళ్తారేమో అని అనుక్షణం బాధ, భయంతో సంతోషం లేకుండా గడిపాడు. జీవితాంతం ఈ పాత గుడ్డల మూట అతని సంతోషాన్ని హరించింది అనుకున్నాడు రాజుగారు.

నీతి:
ఈ కథ బిచ్చగాడిదే కాదు. మనందరముకూడా మూటలు మోస్తున్న వారమే. మనస్సు అనే మూటలో శత్రుత్వము, అసూయ ,ద్వేషము,కోపము,బాధలు మొదలగున్నవి నిరంతరం మోస్తున్నాము. ఈ బరువు మనలోనే పెట్టుకుని పెరిగి పెద్దవారమవుతాము. అందువలన సంతోషించాల్సిన సమయంలో కూడా వీటివల్ల పూర్తి ఆనందం పొందలేక పోతున్నాము. ఎప్పటికపుడు ఈ చెడుగుణములను లోపల స్టోర్ చేయకుండా విడిచి పెట్టలేక పోతున్నాము. అందువలననే ఈ దుఃఖము.
పెద్ద పెద్ద భావనాలయందు, రాజభవనములయందు ఉండేవారు ఒక్కొక్కసారి కథలో బిచ్చగాడి లాగే జీవిస్తుంటారు. కొంతమంది అనాధ ఆశ్రమంలో ఉం టూ ఏమి లేకపోయినా సంతోషంగా తృప్తిగా వుంటారు దర్జాగా రాజుల్లాగా వుంటారు ధైర్యంగా. ఇదంతా బాహ్యంలో కన్పించేది కాదు. అంతరంగంలో మనం ప్రపంచాన్ని చూసే దృక్పధం ఫై ఆధారపడి వుంటుంది. మనం యిళ్ళలో అవరసం లేనివి ,పాతవి జమ చేస్తాము. చెత్తపేరుకు పోతుంది. అవసరమైన వాటిపై ప్రేమతో వాటిని వదిలించుకోవటానికి ఇష్టపడము. క్రమంగా యిల్లు గోడౌన్ అయిపోతుంది.

మనకు ఏది ముఖ్యమో ,ఏది కాదో తెలుసుకోలేము. జీవితం అంతా చిన్న చిన్న విషయాలలోనే చిక్కుకుంటున్నది. వృధా అవుతోంది. ఇది యింటికి మాత్రమే పరిమితం కాదు. మన మనసు అనేక ఆలోచనలతో నిండిన పెద్ద గోడౌన్. ఎన్నో పనికిరాని అవసరమైన ఆలోచనలతో నింపేసాము. మళ్ళీ మళ్ళీ ఇంకా నింపుతున్నాము.

సంతోషంగా ఉండటానికి ఏ కారణం అవసరం లేదు. ఎందుకంటే అది మన స్వరూపమే.  

              మన అహంకారంతో జీవితంలో  వచ్చే ఎన్నో సువర్ణావకాశములను కోల్పోతున్నాము. చేతులారా అవకాశములను వదిలేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎపుడూ మన అహంకారం పోషించు కోవటంలో తీరిక లేకుండా ఉంటున్నాము. ప్రతి క్షణం బరువుగా గడుపుతాము. ప్రతి సంఘటనకు తీవ్ర ఆదుర్దా . ప్రతి చర్యలో కంగారు ,హడావిడి. అహంకారంతో చేసే చర్యలన్నీ నిప్పుల మ్మీద నడకలే. కఠినత్వానికి ,సరళత్వానికి ఏనాటికి పొంతన కుదరదు. మంచి ,చెడు రెండూ ఒకే సమయంలోఉండలేవు.   

             మాంసపు ముక్కను నోట కరుచుకున్న ఒక కాకి ఎగురుతూ ఉన్నది. దానిని చూసి మిగతా పక్షులన్నీ ఆ మాంసపు  ముక్కకై కాకిని తరమసాగాయి . ఇది గమనించి కాకి మాంసపు ముక్కను వదిలేసి పైకెగిరింది. ఇక పక్షులన్నీ కాకి ని వదిలేసి ముక్కవైపు వెళ్లాయి. సుదీర్ఘ ఆకాశంలో ఒంటరిగా సంతోషంగా విహరిస్తున్న  కాకి ఇలా అనుకుంది. “ఒక్క మాంసపు ముక్కను వదిలేస్తే ఆకాశం అంతా నాదే . ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాను!” 

 పరిస్థితులను స్వీకరించు ,దేవుని శరణాగతి చేయి . మిగతావి వదిలేయి … .!

మూలము:

మే 2014: మ్యాగజైన్ మహాత్రియ – అనంత ఆలోచనలు : 

https://saibalsanskaar.wordpress.com/2016/01/28/let-us-be-happy/

శాంతిసందేశం( మహాభారతం)

విలువ:శాంతి

అంతర్గత విలువ :న్యాయం

మహాభారతంలో సంజయుడి రాయబారం విఫలమయిన తరువాత, శ్రీ కృష్ణుడే స్వయంగా దుర్యోధనునితో మాట్లాడడానికి హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. దుర్యోధనుడు కృష్ణుడిని మర్యాదగా ఆహ్వానించాడు. కృష్ణుడు, దుర్యోధనునితో ” నేను పాండవుల తరపున శాంతి సందేశం తీసుకు వచ్చాను. పాండవులకు అర్థరాజ్యం ఇచ్చేబదులు ఐదుగురికీ తలా ఒక గ్రామం ఇస్తే చాలు అని చెప్పమన్నారు. దీనివల్ల నీకు ఇబ్బంది ఉండదు, వారు కూడా ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు, రాజ్యంలో ప్రజల శాంతికి భంగం కలగదు” అని చెప్పాడు.

 

అది విన్న దుర్యోధనుడు కోపంగా ఈ రాజ్యమంతా నాకే సొంతం. సూదిమొన మోపినంత స్థలాన్ని కూడా పాండవులకు ఇవ్వను. నువ్వు పాండవపక్షపాతివి. నిన్ను బంధించి చెరసాలలో పెడతాను అన్నాడు. భటులు కృష్ణుడిని బంధించే ప్రయత్నం చెయ్యగా కృష్ణుడు విశ్వరూపం చూపించాడు. ఆ శక్తికి తట్టుకోలేక భయపడి సభలో చాలామంది కళ్ళు మూసుకున్నారు. నెమ్మదిగా చెప్తే దుర్యోధనుడు వినలేదు కాబట్టి ధర్మాన్ని కాపాడడం కోసం కురుక్షేత్రయుద్ధం జరగాల్సివచ్చింది.

నీతి: మనస్సు అంతా అహంకారం, అసూయ, ద్వేషంతో నిండిపోయి ఉన్నప్పుడు మనుషులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆ మనిషికి లేదా అతని కుటుంబానికి లేదా భారతంలో లాగా మొత్తం రాజ్యానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా భగవంతుడు అవతరించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు.

 

http://www.kidsgen.com/fables_and_fairytales/indian_mythology_stories/krishnas_peace_mission.htm

శాంతిని ప్రతిబింబించే చిత్రము

విలువ: శాంతి 
అంతర్గత విలువ: నిశ్శబ్దం, మనసు శాంతంగా ఉంచుకోవడం 

98498670-CC98-4921-A130-11B61B18717B
ఒక రాజు శాంతిని చూపించగలిగే చిత్రాన్ని వేయమని కోరాడు. చాలామంది చిత్రాలు గీసి తెచ్చారు. రాజు వరుసగా వాటిని పరిశీలించసాగాడు.

అన్ని చిత్రాల్లో రెండు చిత్రాలు చాలా బాగున్నాయి. ఆ రెండింటిలో ఒక దానిని ఎంపిక చేసి బహుమతి ప్రకటించాలి.
మొదటి చిత్రంలో ప్రశాంతంగా ఉన్న నది ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. పైన ఆకాశం, మేఘాలు గీయబడి ఉన్నాయి. అందరు ఆ చిత్రమే ఎంపిక చేస్తారు అని అనుకున్నారు. రెండవ చిత్రంలో కూడా కొండలు ఉన్నాయి కానీ అవి అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు చాలా గంభీరంగా ఉరుములు,మెరుపులతో ఉన్నాయి. కొండలమీద నుండి ఒక జలపాతం ప్రవహిస్తోంది. ఆ చిత్రంలో ఎక్కడా ప్రశాంతత కనిపించట్లేదు.
D6101859-6F32-493E-934E-062E789537AA
రాజు జాగ్రత్తగా పరిశీలించి చూసాడు. జలపాతం పక్కన కొండ పగుళ్లలో నుండి ఒక చిన్న పొద  ఉంది. ఆ పొదలో ఒక పక్షి తన పిల్లలతో ప్రశాంతంగా కూర్చుని ఉంది.   రాజు రెండవ చిత్రానికి బహుమతి ప్రకటించాడు.
నీతి
పరిస్థితులు, వాతావరణం  అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం సులభమే కానీ ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండడం సాధన చెయ్యాలి. మన మనసులోనే శాంతిని వెతుక్కోవాలి. ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం సాధన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చెయ్యలేవు.

ఎవరిని లేక దేన్ని ఎక్కువ ప్రేమిస్తాము ?

 

CF08C74E-001F-434D-998C-562DCFAE5BDD

విలువ: శాంతి,సహనము

అంతర్గత విలువ: నిగ్రహం
ఒక వ్యక్తి తన కారును శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడే ఆడుకుంటున్న అతని  4 సంవత్సరాల చిన్న పాప, ఒక రాయి తీసుకుని కారు మీద ఏదో రాసింది. కారు మీద గీతలు చూసి తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే  చేతిలో ఉన్న రెంచ్ తో పాప అరచేతిలో కొట్టడం మొదలుపెట్టేడు. కొంచెంసేపటికి కోపం తగ్గేక, పాప చెయ్యి చూసి కంగారు పడి పాపను హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. కానీ అప్పటికే పాప చేతి వేళ్ళు విరిగిపోయేయి.
70D2B2C0-6FD8-463E-B801-2EA5C2562439
                హాస్పిటల్లో ఉన్న పాప తండ్రిని ” నాన్నా; నా వేళ్ళు ఎప్పుడు తిరిగి వస్తాయి” అని అడిగింది. దానికి తండ్రి ఏమీ సమధానం చెప్పలేక బాధతో మౌనంగా ఉండిపోయాడు.  కారు దగ్గరికి వెళ్ళి  తన చేసిన తొందరపాటు పనికి బాధపడుతూ, కారును కాలితో తన్నసాగాడు. కొంసేపటికి అసలు కారు మీద తన కూతురు ఏమి రాసిందో చూడాలి అనిపించి దగ్గరగా వెళ్లి చూసాడు.
“నేను నాన్నను ప్రేమిస్తున్నాను” అని రాసి ఉంది.
నీతి:  కోపానికి మరియు ప్రేమకు హద్దులు ఉండవు. మనం ఎప్పుడూ మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. కానీ ఈ రోజుల్లో వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందరినీ  ప్రేమిస్తూ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సహనంతో వ్యవహరించగలిగితే తరవాత బాధపడక్కర్లేదు.

 

నీ మాటల్లో నువ్వేమిటో నాకు కనిపిస్తూఉంటుంది

 

AF1501CC-79BC-4F51-B0D3-08FCAFCE6E6E

విలువ : శాంతి

ఉపవిలువ: సరైన నిర్ణయం
నేను అప్పుడు నెవెడా యూనివర్సిటీ లో సోమవారం ఉదయం 8 గంటలకు క్లాస్ తీసుకుంటున్నాను. నెవెడా యూనివర్సిటీ లాస్ వేగాస్ లో ఉంది. పిల్లలందర్నీ శని,ఆదివారాలు ఎలా గడిచాయి అని అడిగేను. ఒక విద్యార్ధి లేచి నిలబడి, గడచిన రెండు రోజులు తనకు మంచిగా లేవని, తన జ్ఞానదంతం ఒకటి తీసివేసారని చెప్పాడు. మీకు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండడం ఎలా సాధ్యమౌతోంది? అని నన్ను అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానంగా నేను ఒకసారి చదివిన విషయం ఒకటి గుర్తుకువచ్చింది.
మనం ప్రతిరోజూ ఉదయం లేవగానే, ఆ రోజు ఎలా గడపాలి అని నిర్ణయించుకునే అవకాశం మనకి ఉంటుంది. నేను ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటాను అని చెప్పేను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టేను. నేను ఇవాళ మన యూనివర్సిటీ దాకా వచ్చేసరికి నా కారు ఆగిపోయింది. గ్యారేజ్ కి ఫోన్ చేసి నా కారు రిపేరు వచ్చిందని, దానిని తీసుకువెళ్ళడానికి వేరే ట్రక్ పంపించమని అడిగేను. అదేంటి, మీ కారు దారిలో ఆగిపోతే మీరు అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని అడిగేరు. నేను ఇక్కడికి 17 మైళ్ళు దూరంలో ఉంటున్నాను. కారు మధ్యలో ఎక్కడైనా ఆగిపోవచ్చు, కాని సరిగ్గా యూనివర్సిటీ ముందే ఆగింది. నాకు 8 గంటలకు క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఆ క్లాసు కు వెళ్ళి
నా విధులు నిర్వర్తించగలను. అదే దారి మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది కలిగేది, అని చెప్పి క్లాసు కి వచ్చేను.   జరిగింది చెప్పడం ముగించి విద్యార్థులందరి ముఖాలు పరీక్షగా చూసేను. అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళందరికీ నేను ఆనందంగా ఉండడానికి కారణం అర్థమైంది అనిపించింది.
నీతి: 
ప్రతీ విషయంలోనూ మంచినే చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.

మనస్సు యొక్క ప్రతిబింబము

buddha-picture.jpg

 

విలువ — ప్రశాంతత

అంతర్గత విలువ — ఓర్పు, ప్రేమ.

ఉన్నత అధికారి అయిన ఒకపెద్దమనిషి  గౌరవనీయులయిన ఒక సాధువుని కలిశాడు.అధికారి, ఆ సాధువుకి తాను చాలా గొప్ప వాడిని,  నిరూపించాలని అనుకున్నాడు.

సాధువుని ,”ఇప్పటి  దాకా, మీరు నాకు చెప్పిన మాటలు, నాకు ఎలా అనిపించాయో మీకు చెప్పమంటారా? “అని అడిగాడు. సాధువు ‘ నా గురించి నీకు ఎటువంటి అభిప్రాయమున్నా అది నాకనవసరము.  నేను దాన్ని పట్టించుకోను,ఎందుకంటే అది నీకు సంబంధించిన విషయము’. అని జవాబు ఇచ్చాడు.

అధికారి “ మీకు వినాలని లేక పోయినా సరే ,నేను చెప్పదలచుకున్నాను , వినండి.”‘మీరు , నాకు  ఎందుకూ పనికిరాని వారిలా కనిపిస్తున్నారు’. అని సాధువుని కించపరుస్తూ మాట్లాడాడు. కాని, ఈ మాటలు విన్న సాధువు చలించకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండిపోయారు .

దాంతో , తన మాటలతో  చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లైందని తెలుసుకున్న అధికారి,  “ నా గురించి, మీరేమనుకుంటున్నారు,నాకు తెలుసుకోవాలని ఉంది  అని తిరిగి ప్రశ్నించాడు. నువ్వు నా కళ్ళకి, బుద్ధునిలా కనిపిస్తున్నావు ‘ అన్నాడు సాధువు.

ఇది విన్న అధికారి, సంతోషంగా ఇంటికి వెళ్ళి ,తన భార్యకి సాధువు తన గొప్పతనాన్ని  గుర్తించిన విషయం చెప్పాడు.

జరిగిందంతా విన్న భార్య, “ మీరెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారండి. మన  అలోచనలు, బుద్ధి, పనికి రానివి అయినప్పుడు , మనకి ఎదుటివారిలో కూడా అవే  కనిపిస్తాయి. గౌరవనీయులయిన సాధువుకి బుద్ధుని లాంటి హృదయముండటం వల్ల ,ఆయనకి మీతో పాటు అందరిలో కూడా బుద్ధుడే కనిపిస్తున్నారు. “ అని తన భర్తకి అర్ధమేయ్యేలా సున్నితంగా చెప్పింది.  

నీతి:

“యద్భావం తద్భవతి అంటారు”  మన మనసు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు నిర్మలంగా, ఉన్నప్పుడు, అవి మనము చేసే పనులలో కూడా  ప్రతిబింబిస్తాయి.

http://amritham99.blogspot.sg/search/label/inspiring%20stories

https://saibalsanskaar.wordpress.com/2015/08/11/reflection-of-mind/

https://www.facebook.com/neetikathalu

ఐక్యతలో ఉన్న శక్తి — పక్షులు నేర్పిన పాఠము

విలువ — సరైన నడత, ప్రేమ
అంతర్గత విలువ — సహనము / ఓర్పు , ఐక్యత.

 

EFD07F04-F7C4-484A-9BD5-5EE57AFF70F8

ఒక పురాతన గుడి కప్పు పైన చాలా పావురాళ్ళు నివసించేవి. గుడి పునరుద్ధరణ సమయంలో అక్కడ దగ్గరగా ఉన్న చర్చి కప్పు పైకి పావురాళ్ళు నీవిచించడానికి చేరాయి.

చర్చి కప్పు పైన ఉన్న పావురాళ్ళు , కొత్తగా వచ్చిన పౌరాళ్ళని , ఎంతో ప్రేమగా ఆహ్వానించాయి.

క్రిస్మస్ కి చర్చి అంతా బాగుచేయాల్సి వచ్చింది .అప్పుడు పావురాళ్ళు అన్నీ దగ్గరలో
ఉన్న మసీదుకి మారాయి . మసీదు కప్పు పైన ఉన్న పావురాళ్ళు , కొత్తగా వచ్చిన పౌరాళ్ళని , ఎంతో ప్రేమగా ఆహ్వానించాయి.

రంజాన్ పండగ వల్ల మసీదు అంతా బాగుచేయాల్సి వచ్చింది .అప్పుడు అన్నీ పావురాళ్ళు పురాతన గుడికి వెళ్లిపోయాయి.

ఒక రోజు బజారులో మత కలహాలు జరిగాయి. ఒక చిన్న పావురము చూసి “వీళ్లు ఎవరు అని అడిగింది ”
దానికి తల్లి పావురము “వీళ్ళు మనుషులు ” అని సమాధానము చెప్పింది.
“ఎందుకు అలా గొడవ పడుతున్నారు ” అని అడిగింది చిన్న పావురము.

తల్లి పావురము ఇలా చెప్పింది ” గుడికి వెళ్లే వాళ్ళని “హిందువులు” అంట్టారు. చర్చికి వెళ్లే వాళ్ళని
“క్రిస్టియన్ “అంటారు. మసీదుకి వెళ్లే వాళ్ళని “ముస్లిం”అంటారు ”

చిన్న పావురము అంది “మనము గుడికి వెళ్లినా , చర్చికి వెళ్లినా , మసీదుకి వెళ్ళినా
, ‘పావురాళ్ళు’అనే కదా పిలుస్తారు ? అలాగే వాళ్ళని కూడా ‘మనుషులు’అని పిలవాలి కదా?”

అప్పుడు తల్లి పావురము ఇలా అంది “మనము భగవంతుడిని అనుభవించాము, అందుకనే ఉన్నత స్థితిలో ఉన్నాము , ఆకాశంలో ఎగఎగురుతున్నాము
, నశ్చింతంగా ఉంటాము. వాళ్ళు భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు, అందుకే కింద ఉండి కొట్టుకుంటున్నారు “.

నీతి:
ముందు మనమంతా జాతి, మత , భేదాలని పక్కన పెట్టి మనుషులమని గుర్తించాలి.కలిసి మెలిసి ఐకమత్యంగా ఉంటేనే, ప్రపంచమంతా ఆనందం మరియు సుఖ శాంతులతో కలకళ్ళాడుతుంది .

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu