ఏడవ శ్లోకము
మానవ జీవితంలోని నాలుగు ముఖ్యమైన దశలు. వాటిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి
బాల స్తావత్ క్రీడాసక్తః
తరుణ స్తావత్ తరుణీసక్తః |
వృద్ధ స్తావత్-చింతామగ్నః
పరమే బ్రహ్మణి కోஉపి న లగ్నః
భజగోవిందం భజగోవిందం || 7||
అనువాదం
ఆటలు పాటల బాల్యం గడిచెను
ప్రేమని పెండ్లని ప్రాయం నడిచెను
చింతలు వంతలు చీకున ముసిరెను
పరబ్రహ్మ కాబట్టక పోయెను
భజగోవిందం భజగోవిందం || 7||
తాత్పర్యం: బాల్యం లో ఆటల యందు ఆసక్తి ,యవ్వనంలో యువతులపై ఆసక్తి , ముసలి తనంలో మనసునిండా చింతలే. పరమేశ్వరుని యందు ఆసక్తి ఎవరికీ ఉండదు.
గోవిందుని భజించు ,గోవునందుని కీర్తించు . ఓ మందమతి ! గోవిందుని సేవించు .
విద్యార్థులకొరకు కథ:
కుళ్ళిన అరటిపండ్లు .
విలువ : సత్ప్రవర్తన :
ఉపవిలువ : ఎపుడు చేయవలసిన పనిని అప్పుడు చెయ్యకుండా వాయిదా వేస్తుండటం.
నారిమన్ చాలా మంచివాడు . ఎప్పుడూ దేవుని నామము స్మరించుకుంటూ ఎంతో సేపు ధ్యానం చేస్తూ దేవునితో అనుసంధానం చెంది ఎంతో శక్తిని , ప్రేరణని పొందుతుండేవాడు. అతని జీతంలో కొంత భాగమును ,తన సమయంలో కొంత భాగమును బీదప్రజలకి సహాయపడటానికి కేటాయంచేవాడు. ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నపుడు అక్కడకి వెళ్లి సహాయం చేసేవాడు. తాను పండ్లను కొనుక్కొని, ఆసుపత్రులలో బీద రోగులకు పంచుతుండేవాడు. బీద ప్రజలు నివసించే కాలనీలకు వెళ్లి అక్కడి పిల్లలకి ఐస్ క్రీంలని కొనివ్వటం , లేక ఏదన్నా సినిమా చూపించటం చేసేవాడు . అతను చేసే ప్రతి సేవ భగవంతుడి సేవగా భావించేవాడు. ఒక రోజు యువకుడైన తన కొడుకు మణిత్ ని ” మణిత్, నేను గుడికి వెళ్తున్నాను. అరటిపండ్లను అక్కడ గుడి బైట కూర్చుని ఉండే బిచ్చగాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఆ పనిలో నాకు సహాయం చేస్తావా”? అని అడిగాడు. మణిత్ ” ఓహ్ !ఏంటి నాన్నా “? నాకు ఇట్లాంటి పనులు చెప్తావు?. నేను ఏమన్నా ముసలి వాడినా? గుడికి వెళ్ళటం, పండ్లు పంచటం ఇట్లాంటి పనులు చేయటానికి. ఇవి నేను చెయ్యవలసిన పనులు కాదు. నీవు పెద్దవాడివి. ఇట్లాంటి పనులన్నీ పెద్దవాళ్ళు చేయవలసినవి, నాలాంటి యువకులు కాదు. నాకీ పనులు చెయ్యాలని లేదు. నీ అంత అయినపుడు చేస్తాలే . కానీ ఎప్పుడు కాదు అని చెప్తూ , వాక్ మాన్ ,హెడ్ఫోన్స్ చెవిలో పెట్టుకొని రాక్ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఉండి పోయాడు.
నారిమన్ కొడుకు ధోరణి చూసి , ఏమీ మాట్లాడకుండా తాను అనుకున్న ప్రకారం గుడికి అక్కడున్న బిచ్చగాళ్ళలో పండ్లను పంచేశాడు. కొన్నాళ్ల తరువాత ఒక పెద్ద బుట్టనిండా అరటిపండ్లు తెచ్చి వరండాలో పెట్టి స్నానం చేసిరావటానికి లోపలకి వెళ్ళాడు , ఇంతలో అటుగా వచ్చిన మణిత్ ఆ పండ్లను చూశాడు. అవి బాగా క్రుళ్ళి పోయి ఉన్నాయి . వాటిమీద చిన్న దోమలు ముసిరి ఉ న్నాయి. పండ్లు ఏమాత్రం బాగాలేవు. ఇంతలో నారిమన్ తెల్లని దుస్తులు ధరించి ,చక్కగా తయారయ్యి ఆ అరటిపండ్ల బుట్టని కారు డిక్కీ లో పెడుతుంటే, మణిత్, ” నాన్నా! ఈ పండ్లని ఎక్కడకి తీసుకెళ్తున్నావు” అని అడిగాడు. నారిమన్, గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు మణిత్ ” అదేంటి నాన్నా తాజా పండ్లు కొని గుడికి తీసుకెళ్ళు. ఈ క్రుళ్ళిన పండ్లు ఎందుకు కొన్నావు? దేవుడికి ఇలాంటివి ఇవ్వటం సిగ్గు చేటు”. అన్నాడు.అప్పుడు తండ్రి , నీవు కూడా , బాగా పెద్దవాడైన తర్వాత దేవుని పూజిస్తానంటే నీ వల్ల దేవునికి ఏమి ఉపయోగం? ముసలి వాడివి అయ్యాక ,ఏమి చేయగలవు? అట్లాగే అతిగా పండిన ,మగ్గిన పండ్లని ఉపయోగించవచ్చులే”అని బదులు చెప్పాడు. అది విని కొడుకు సిగ్గుతో తలవంచుకున్నాడు. సిగ్గుతో తండ్రి వైపు చూడలేక పోయాడు. తండ్రి సరైన సమయంలో సరైన కారణం చెప్పగలిగిగాడు.
తండ్రి ,”నీవు యువకుడిగా ఉన్నప్పుడు ,భగవంతునికి ఎంతయినా సేవ చేయగలవు, ఆపదలో ఉన్న వారికి సేవలందించగలవు . నీ సమయాన్ని , డబ్బును కూడా బీదవారి కోసం ఖర్చుపెట్టవచ్చు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు . కానీ, నువ్వు ముసలివాడవైతే నీ శరీరం లో అనేక రుగ్మతలు వస్తాయి. అప్పుడు, నీకే ఎవరన్నా సేవ చెయ్యాలి. ధన సంపాదన లేకపోతే ఆర్థిక బాధలుంటాయి ,ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎవరికి తెలుసు? వయసుతో వచ్చే కాళ్ళ నొప్పులు , మోకాళ్ళ నొప్పులతో కొద్ది గంటలైనా కూర్చొని దైవ ప్రార్ధన చేయగలవా? నీవు దేవునికి ఏమి సమర్పించగలవు? ఆ సమయంలో నీకు ఇప్పటికంటే కూడా , దైవానుగ్రహం చాలా అవసరం”, అన్నాడు. ఈ మాటలన్నీ చెప్పి తండ్రి బుట్టని కారు డిక్కీ లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. కొడుకుకు చెప్పాల్సినవి చెప్పాడు. కానీ గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పళ్ళు దేవుడికి సమర్పించటానికి పనికిరావని ఆయనకీ తెలుసు . ఆ బుట్టలో ఉన్న పండ్లని గుడికి తుసుకెళ్ళకుండా , గోశాలకు తీసుకెళ్లి ఆవులకు తినిపించాడు. క్రుళ్ళిన అరటిపండ్లు ఆ రాకంగా మణిత్ కి బుద్ధి చెప్పటానికి,ఆవుల ఆకలిని తీర్చటానికి పనికొచ్చాయి .
నేర్చుకోవలసిన విషయము:
మానసికంగా, శారీరకంగా , ఆర్ధికంగా ఇంకొకరికి సహాయ పడే స్థితిలో వున్నపుడు తప్పక సహాయం చెయ్యాలి. దానివల్ల అతనికి, ఇతరులకి కూడా ఉపయోగదాయకం. ఏ పనైనా సరే సరైన సమయంలో చేస్తేనే అది అర్ధవంతం అవుతుంది. దాని ప్రయోజనము నెరవేరుతుంది. తప్పక నిర్వహించవలసిన కర్తవ్యములను రేపు, రేపంటూ వాయిదా వేయవద్దు. ఆలస్యము చేయవద్దు. తగిన సమయంలో చెయ్యాలి . సాక్షత్ యుగ పురుషులైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఇలా అన్నారు,” మ్రొక్కను వంచవచ్చు ,అదే చెట్టును వ్రంచితే అది విరిగి పోతుంది. పిల్లలు యువకులుగా పరివర్తన చెందే కాలంలో వారు ప్రపంచ ఆకర్షణ , ఉద్యోగం , కుటుంబ విషయములలో పూర్తిగా నిమగ్నం అవుతారు. చిన్నతనం లోనే పిల్లలను, మానవతా విలువలను బోధిస్తూ పెంచితే వారు పెరిగిన కొద్దీ ప్రపంచ ఆకర్షణలకు లొంగి దారిని తప్పినా కూడా ,మళ్ళి ఖచ్చితంగా చిన్నప్పటి మంచి దారికే వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తప్పని సరిగా దైవ ప్రార్ధన చెయ్యాలి ,భగవంతునికి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉండాలి.
ఇలాంటి అలవాటును చిన్నప్పటినుండి ఎవరు అనుసరిస్తారో , వారు వారి వయస్సు పెరుగుతున్నకొద్దీ, ఎంతో నిబ్బరంగా ప్రశాంతంగా ఉంటూ ,జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ,ఒత్తిడిని ఎదురుకొనగలుగుతారు. అటువంటివారు భౌతిక సుఖములు ,ఆధ్యాత్మిక పురోగమనం పొందుతారు.