విలువ : ధర్మ
ఉప విలువ : గురువు పట్ల శిష్యునికి ఉండవలసిన ప్రేమ ,భక్తి .
పూర్వం పాంచాల దేశంలో ధౌమ్యుడు అనే ఒకఋషికి ఆరుణి అనబడే అంకిత భావం గల మంచి శిష్యుడు ఉండేవాడు. ఆరుణి గురువు ఆశ్రమంలోనే ఉంటూ నిత్యం ఆశ్రమం లో జరిగే కార్యక్రమములు అన్నింటిలో పాల్గొని తన సేవలను అందిస్తూ గురువుగారి వద్ద దివ్యజ్ఞానమును పొందాలని అభిలషించేవాడు.
ఒక రోజున చలి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ రోజన ఆరుణి అడవి నుంచి సేకరించిన కట్టెలను ఆశ్రమానికి తీసుకొస్తున్నాడు . ఆశ్రమంలో తన గురువుగారి పొలం పక్కనుంచి వస్తూ పొలం గట్టున ఉన్న కాలువ ఒడ్డుకు గండి పడటం గమనించాడు . అలా గండి పడటం వలన
పొలంలో నీరంతా బయటకు పోతున్నది. అలా మొత్తం నీరంతా పొతే నీరు లేక పొలం ఎండిపోతుంది ,పంట పూర్తిగా నష్టమైపోతుంది. ఆరుణి ఈ విధంగా ఆలోచించాడు“ఇపుడు నేను ఏమి చేయాలి? నేను గండి పూడ్చటం కోసం ఇక్కడ ఉండిపోతే ఆశ్రమానికి కట్టెలు చేర్చలేను. కట్టెలు అందించలేకపోతే హోమం లేక, ఆశ్రమం లో అంతా చల్లగా అయిపోతుంది. అందువల్ల నేను త్వర,త్వరగా ఆశ్రమానికి వెళ్ళి కట్టెలు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈ కాలువ గట్టును బాగు చేస్తాను.”
ఈ లోగా ఆశ్రమంలో గురువుగారు పిల్లలకు పాఠాలు నేర్పటానికి సిద్ధంగాకూర్చుని ఉన్నారు . ఆరుణి పాఠం నేర్చుకోవటానికి ఇంకా రాలేదు. ఇంతలో ఆరుణి హడావుడిగా వచ్చి ఆశ్రమంలో కట్టెలు అందచేసి గురువుగారికి కాలువ గండి పడిన విషయాన్ని చెప్పి వెంటనే తిరిగి పొలం దగ్గరకి వెళ్ళాడు. అంత భాద్యత గల శిష్యుడిని చూసి గురువు ధౌమ్యుడు చాలా ఆనందించాడు.
వేగంగా పొలానికి తిరిగి వెళ్ళిన ఆరుణి కాలువకు పడిన గండిని పూడ్చడానికి కొన్ని కట్టెలను ,మట్టిని అడ్డుపెట్టాడు. అయినాకాని నీరు కారిపోవడం ఆగలేదు. నీరు బాగా వేగంగా,ఉధృతంగా ఉండటం వలన ఆరుణి కట్టిన తాత్కాలిక ఆనకట్ట కొట్టుకు పోయింది.
ఆరుణికి ఏం చేయాలో తోచలేదు. సమయం వ్యవధి తక్కువగా ఉంది. ఆ నీటిని ఆపటం ఎలాగో ఆరుణికి అర్థం కాలేదు. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది . నీరు కాలువ నుండి బయటికి పోకుండా ఆపటానికి అతనికి ఒక ఉపాయం తోచింది. ఇంతలో సాయంకాలం అయింది, చీకటి పడింది. ఆరుణి ఇంకా ఆశ్రమానికి తిరిగి రావకపోవటంతో ఆశ్రమంలో అందరూ కంగారు పడసాగారు. ధౌమ్యుడు తన శిష్యులందరితో కలిసి ఆరుణి ని వెదకటానికి బయలుదేరాడు. పొలం వద్దకు వెళ్ళి “ఆరుణి !” అంటూ గట్టిగా ధౌమ్యఋషి పిలిచారు. అప్పుడు ఆయనకు బలహీనంగా ఉన్న ఒక గొంతు “ఇక్కడ ఉన్నాను గురువుగారు”అనటం వినిపించింది. అందరూ ఆ ధ్వనివినపడిన వైపుగా పరిగెత్తారు. తీరా చూస్తే నీరు బయటకు పోకుండా ఆరుణి ఆ కాలువ గండికి అడ్డముగా పడుకునున్నాడు. నీటిని ఆపటం అసాధ్యం కావటంతో , తానే స్వయంగా గండికి అడ్డంగా పడుకున్నాడు అని గురువుగారికి అర్ధమైంది . శిష్యులంతా కలిసి ముందుగా, ఆరుణిని ఆ గడ్డ కట్టించే ఆ చల్లని నీటి నుండి బయటకు లాగేసారు. కాలువ గండిని మనం కలిసి పూడ్చివేద్దాం … విచారించవద్దు “ఆరుణి “ అన్నారు శిష్యులంతా .
ఆరుణితో “, బిడ్డా ! ఈ పంట కంటే నీవే విలువైనవాడివి”,అని అన్నారు గురువుగారు . ఆరుణిని ఒక కంబళి లో వెచ్చగా చుట్టి ఆశ్రమానికి తీసుకొచ్చారు . ఆరుణి ని దగ్గరకు తీసుకుని అతనిని ఆశీర్వదిస్తూ ధౌమ్యుడు ,”గురువు పట్ల నీకు గల సాటిలేని భక్తి వినమ్రత నీకు శాశ్వత కీర్తిని ప్రసాదిస్తాయి” అన్నారు .
నీతి : గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం సాటిలేనివి . గురువు మెచ్చుకునే గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం .
https://saibalsanskaar.wordpress.com/2016/06/02/arunis-devotion/