భజగోవిందం
ఉపోద్ఘాతము
శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన భజగోవిందం భక్తి వైరాగ్య భావనలు పెంచే అతి సరళమైన ఎంతో జ్ఞానసంపత్తిని కలిగిన గొప్ప వేదాంత సాహిత్యము. ఒక రోజున శంకరాచార్యులు వారి శిష్యులతో కలిసి కాశీపుర వీధులలో పర్యటిస్తూఉండగా , దారిలో ఒక ముసలి పండితుడు పాణినీ వ్యాకరణ సూత్రములు వల్లె వేస్తూ కనిపించాడు. ఆ పండితుడి యొక్క దృష్టి, ఆసక్తి వ్యాకరణ సారాంశము మీద కాకుండా, కేవలము వ్యాకరణమును వల్లె వేయుటయందు, కంఠస్తము చేయుటయందు పరిమితమై ఉండుట గమనించారు ఆచార్యులు.
అది చుసిన మరుక్షణమే ప్రేరణ పొందినటివంటి ఆచార్యుల వారిచే ప్రకటితమైన మహత్తరమైన భక్తి జ్ఞాన సంపన్నమైన శ్లోకముల సముదాయమే భజగోవిందం.
మొదటి శ్లోకము
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృం కరణే
అనువాదము
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
మృత్యువు దాపున మొసలుచు నుండగ
వ్యాకరణము నిను కాపాడదురా
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే!!!
భావము: ఓ మూఢుడా : గోవిందుని భజన చెయ్యి. మరణ కాలము ఆసన్నమైనపుడు, డుకృం కరణే అని నీవు వల్ల వేసే వ్యాకరణ పాఠం నిన్ను రక్షించదు.
కథ – అక్బరు- సూఫీ ఫకీరు
ఒకనాడు ఒక గొప్ప సూఫీ ఫకీరు కొంత సహాయము అడుగుటకు అక్బరు చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. ఆ ఫకీరు రాజభవనం చేరేటప్పటికి అక్బరు దైవ ప్రార్థన చేస్తూ ఉండటం చూసాడు. అక్బరు రెండు చేతులూ పైకెత్తి ఎంతో సంపద మరియు అధికారమును ప్రసాదించమని వేడుకుంటున్నాడు. ఇది చూసిన సూఫీ ఫకీరు మరుక్షణమే వెళ్ళిపోసాగాడు.
ఈ లోపల ప్రార్థన పూర్తి చేసుకున్న అక్బర్ చక్రవర్తి, సూఫీ ఫకీరు వెళ్తూ ఉండడం గమనించి త్వరత్వరగా వెళ్ళి ఫకీరు కాళ్ళపై పడి తన దగ్గరకు వచ్చిన కారణము తెలుపమని ఫకీరుని ప్రార్థించాడు.
అప్పుడు ఫకీరు ఈ విధంగా అన్నాడు” నీ నుండి కొంత సహాయము పొందుటకై నేను వచ్చాను. కానీ నీవు కూడా దేవుని సహాయము యాచించుట నేను గమనించాను. ఒక యాచకుడు, వేరొక యాచకుడికి ఏమి సహాయం చేయగలడు అనుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఫకీరును. భగవంతుని నా జీవితము సాగించుటకై కావలసిన ఆహారేతర అవసరములకు మాత్రమే ప్రార్థిస్తున్నాను. నీవు నాకంటే పెద్ద యాచకుడివి. అధిక ధనము, కీర్తి, అధికారము కొరకు ప్రార్ధిస్తున్నావు. కావున నిన్ను యాచించుట కంటే, నేనే స్వయంగా భగవంతుని యాచించుట ఉత్తమము”. ఆ ఫకీరు మాటలు విన్న అక్బరు జ్ఞానోదయము పొంది “ఆహా; నేనెంతటి గొప్ప చక్రవర్తిని అయినప్పటికీ, నాలో ఎంత పేదరికము, దౌర్బల్యము ఉన్నాయి కదా అని అనుకున్నాడు.
సారాంశము
శంకరాచార్యులవారు ఈ విధంగా అంటున్నారు ” మనం దేని కొరకు యాచిస్తున్నాము? కోరిక తీరడంకోసమే.అప్పుడు మన భక్తి,కోరికలు తీర్చే ఉపాయంగా మారుతుంది. ఇది ఒక బార్టర్ పధ్ధతి.అంటే ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ. భగవంతుని యందు భక్తి నిర్మలంగా, స్వఛ్ఛంగా ఎటువంటి కోరికలు లేకుండా ఉండాలి. అటువంటి భక్తిలో సార్థకత ఉంటుంది. సత్యము నందు ప్రేమను పొందుటే భక్తి.పరిపూర్ణ భక్తిలోనే సంరక్షణ ఉందన్న అనుభూతి చెందినవాడు అసలైన భక్తుడు. అనిత్యమైన వస్తువులు, ధనము ఎంత కూడా బెట్టినా నిశ్చింతను, రక్షణను ఇవ్వలేవు. అవసరమేదో, దురాశ ఏదో తెలుసుకోవాలి. దురాశ వలన అభద్రత, అశాంతి, దుఃఖము జీవితాంతం ఉండి, జీవిత ఆఖరిక్షణాల్లో కూడా అసంతృప్తిగా ఉంటాడు. కాబట్టి భగవంతుని యందు నిరపేక్ష కలిగిన స్వఛ్ఛమైన ప్రేమని పెంచుకోవాలి.