విలువ: అహింస,
అంతర్గత విలువ: శాంతి
ఓ చక్రవర్తి వద్ద ఒక గొప్ప ఖడ్గం ఉండేది.దాని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు.ఆ చక్రవర్తి తన భవనంలో ఎల్లప్పుడూ విందులు విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఒకసారి పొరుగున ఉన్న రాజుతో వచ్చిన తగాదా రెండు రాజ్యాలకీ మధ్య యుద్ధానికి దారి తీసింది.
ఇంత కాలం యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆ ఖడ్గానికి ఉత్సాహం ఎక్కువైంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తన ధైర్యాన్ని మరియు ప్రత్యేకతలను అందరికీ చాటి చెప్పే అవకాశం వచ్చిందని భావించింది.అన్ని ఖడ్గాలకంటే ముందు వరుసలో నిలబడి, తన పౌరుష ప్రతాపాలను చూపి తనే అన్ని అఖండ విజయాలను సాధించినట్టు ఊహలలో తేలిపోయింది.
అనుకున్నట్టే యుద్ధం ప్రారంభమైంది.యుద్ద రంగంలో సంభవించే పరిణామాలను చూసి ఆ ఖడ్గం నివ్వెరపోయింది.తను ఊహించుకున్నట్టు ఏ విషయాలు యుద్ధంలో కనబడలేదు సరి కదా, దానికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా అన్ని ఆయుధాలు విరిగి పడి ఉన్నాయి.తినడానికి ఏమీ దొరకక లెక్కలేనంత జనం ఆకలి దాహాలతో అలమటిస్తున్నారు.ప్రతి చోట దుమ్ము ధూళి పేరుకు పోయి, శవాలన్నీ రక్తపు బురదగా యుద్ధ రంగం అంతటా దుర్వాసన వస్తూ ఉంది.కాళ్లు-చేతులు తెగి పడిన వారు కొందరు, కొన ఊపిరితో మరికొందరు, గాయాల నుండి రక్తం ఓడుతూ ఇంకొందరు, ఇలా వారందరి హృదయ విదారకమైన ఆర్తనాదాలతో యుద్ధ రంగం మారు మ్రోగి పోతూ, చాలా దయనీయంగా కనిపిస్తోంది.
ఇదంతా చూసి ఆ ఖడ్గానికి జ్ఞానోదయం అయింది. యుద్దాలంటేనే విరక్తి కలిగింది.ఇక మీదట ఆటలపోటీలలో తప్ప ఇంకే యుద్ధంలో పాల్గొనరాదని నిర్ణయించుకుంది.యుద్ధాలలో పాల్గొనకుండా ఉపాయాలు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది.లయబద్ధంగా అటు ఇటు ముందు నెమ్మదిగా కదిలి, క్రమంగా వేగంగా తిరగడం మొదలు పెట్టింది.తరువాత పెద్దగా శబ్దం రావడం మొదలైంది.మిగిలిన ఖడ్గాలు, సైనికుల ఒంటిపై కవచాలు ఇదంతా చూసి అదేమిటని అడిగాయి.“నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు, నేను రేపటి నుండి యుద్ధంలో పాల్గొనను”, అని ఖడ్గం సమాధానం ఇచ్చింది.“యుద్ధం అంటే ఎవరు మాత్రం ఇష్టపడతారు, కానీ మనం ఏం చేయగలం”, అని ఒక ఖడ్గం నిట్టూర్చింది. “మీరు కూడా నాలాగనే లయబద్ధంగా కదులుతూ శబ్దం చేయడం మొదలుపెట్టండి, దాని వలన ఎవరికీ నిద్ర పట్టదు”, అని ఖడ్గం సమాధానం చెప్పింది.
అన్ని ఖడ్గాలు మరియు ఇతర ఆయుధాలు అలాగే శబ్దం చెయ్యడం మొదలుపెట్టాయి. శత్రు శిబిరం లోని కత్తులు కూడా వీటితో జత కలిపాయి. రాత్రంతా చెవులు చిల్లులుపడేలా ఎక్కడ చూసినా శబ్దంతో నిండిపోయింది. తెల్లవారే సరికి ఒక్క ఆయుధం కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు. రాత్రంతా నిద్ర కరువై సైనికులు, సైన్యాధికారులు మరియు ఇరు రాజులూ నిద్ర కరువై అతి కష్టం మీద సాయంత్రానికి నిద్ర లేచారు. యుద్ధం మరునాటికి వాయిదా పడింది. అన్ని ఆయుధాలు ఆ రాత్రి కూడా మరొక సారి శబ్దం చేయసాగాయి. రాత్రంతా మళ్ళీ ఏ ఒక్కరికి నిద్రలేక యుద్ధం మళ్ళీ ఆ మరుసటి రోజుకు వాయిదా పడింది. ఇలా ఏడు రోజులు గడిచాయి, యుద్ధం వాయిదా పడటం మామూలు అయిపోయింది. ఇరు పక్షాల రాజులు తప్పనిసరి పరిస్థితులలో అసహనంగానే సమావేశమయ్యారు. ఇంతకు ముందు వచ్చిన తగాదాకి ఒకరిపై మరొకరు తీవ్ర కోపంతో ఉన్నా, అతి కష్టం మీద శాంతి చర్చలు కొనసాగించారు. ఆయుధాల శబ్దాలు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. అందరికీ నిద్రలేక పోవడం కూడా కాస్త అయోమయంగా అనిపించి ఇద్దరూ కొంత సేపు నవ్వుకుని మళ్ళీ స్నేహితులుగా మారిపోయారు.
అదృష్టవశాత్తు వాళ్లిద్దరూ పాత తగాదాలు మరచి యుద్ధానికి చరమగీతం పాడారు. తమ మధ్య శత్రుత్వం అంతరించి మైత్రి నేల కొన్నందుకు సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో ఇరువురి రాజ్యాలకూ తిరిగి వెళ్ళారు.తరువాత వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ తమ అనుభవాలను పంచుకోవడం మొదలుపెట్టారు. వారి మధ్య శత్రుత్వంకంటే కూడా మైత్రి పెరగడానికి ఎక్కువ సంఘటనలు దోహదం చేశాయని గుర్తించారు.చిన్నపాటి విభేదాలను విస్మరించి శాంతి సౌభాగ్యాలకు, రెండు రాజ్యాల అభ్యున్నతికి కృషి చేస్తూ గొప్ప చక్ర వర్తులుగా పేరు తెచ్చుకున్నారు.
నీతి :- ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలనే కోరుకుంటారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాబోదు.శాంతిని స్థాపించడానికి అహింసకు మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.
https://saibalsanskaar.wordpress.com